AP Schools Mobile Ban : ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల్లో సెల్ ఫోన్ల వినియోగంపై నిషేధం విధించింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీచేసింది. స్కూళ్లలో విద్యార్థులు మొబైల్ ఫోన్లు వినియోగించడంపై పూర్తి నిషేధం విధిస్తూ ఆదేశాలు ఇచ్చింది. టీచర్లు సైతం తరగతి గదుల్లోకి సెల్ ఫోన్లు తీసుకురాకూడదని ఆంక్షలు విధించింది. ఉపాధ్యాయులు క్లాస్ కు వెళ్లే ముందు తమ మొబైల్స్ను హెచ్ మాస్టర్ కు అప్పగించాలని సూచించింది. యూనెస్కో విడుదల చేసిన గ్లోబల్ ఎడ్యుకేషన్ మానిటరింగ్ నివేదిక ఆధారంగా పాఠశాలల్లో విద్యార్థుల బోధనకు ఎలాంటి ఆటంకం కలకకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు విద్యాశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. అయితే ఉపాధ్యాయ సంఘాలు, ఇతర వర్గాలతో చర్చించిన అనంతరం సెల్ ఫోన్ల నిషేధం నిర్ణయం తీసుకున్నట్టు విద్యాశాఖ ప్రకటించింది. ఈ నిబంధనలు ఉల్లంఘించిన టీచర్లపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉన్నతాధికారులు ఈ నిబంధనలు కచ్చితంగా అమలు అయ్యేలా పర్యవేక్షించాలని విద్యాశాఖ ఆదేశాలు ఇచ్చింది.